త్వరలో ఇంటర్ విద్యార్థులకూ జగనన్న గోరుముద్ద

త్వరలో ఇంటర్ విద్యార్థులకూ జగనన్న గోరుముద్ద

జగనన్న గోరుముద్ద‘ దేశానికే ఆదర్శంగా నిలిచిందని.. ఈ పథకాన్ని పొరుగు రాష్ట్రాలు సైతం అనుసరిస్తుండటమే ఇందుకు నిదర్శనమని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కొనియాడారు.

ప్రస్తుతం ఒకటో తరగతి నుంచి 10వ తరగతి వరకు అమలు చేస్తోన్న ఈ పథకాన్ని త్వరలో ఇంటర్మీడియట్ కు వర్తింప చేయాలని ప్రభుత్వం ఆలోచన చేస్తోందని తెలిపారు. శాసనసభ సమావేశాల్లో ప్రశ్నోత్తరాల సందర్భంగా సోమ వారం పలువురు సభ్యులడిగిన ప్రశ్నలకు మంత్రి బొత్స బదులిచ్చారు.

సీఎం వైఎస్ జగన్ పగ్గాలు చేపట్టాక విద్యా వ్యవస్థలో ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని గుర్తు చేశారు. మన విద్యా విధానంలోని మార్పులకు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు వస్తున్నాయని చెప్పారు. ప్రైవేటు స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నామన్నారు.

అమ్మఒడి పథకంతో డ్రాప్ అవుట్స్ గణనీయంగా తగ్గాయని వెల్లడించారు. గోరుముద్దతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులంతా బడిబాటపట్టారన్నారు. నాడు నేడుతో పాఠశాలల రూపురేఖలు సమూలంగా మారాయని తెలిపారు. అంతర్జాతీయ స్థాయి విద్యా ప్రమాణాలతో విద్యా బోధన అందిస్తున్న ఏకైక రాష్ట్రం మనదేనన్నారు.

డీఎస్సీపై త్వరలో నిర్ణయం..

మధ్యాహ్న భోజన పథకం కింద చంద్రబాబు హయాంలో కేవలం రూ.2,729 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని మంత్రి బొత్స గుర్తు చేశారు. తమ ప్రభుత్వ హయాంలో ఈ నాలుగేళ్లలోనే రూ.6,268 కోట్లు ఖర్చు చేశామన్నారు.

ప్రస్తుత విద్యాసంవత్సరంలో మరో రూ.1,500 కోట్లకుపైగా ఖర్చు చేయబోతున్నామని వెల్లడించారు. మండలానికి కనీసం రెండు ఉన్నత పాఠశాలలను ఇంటర్ వరకు అప్లోడ్ చేయాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. దీంతో 1-10 తరగతి వరకు చదివే విద్యార్థులకు అమలు చేస్తున్న గోరుముద్ద పథకాన్ని అదే కాంపౌండ్లో చదివే ఇంటర్ విద్యార్థులకు కూడా వర్తింపచేయాలని ప్రభుత్వం ఆలోచిస్తోందన్నారు.

త్వరలోనే శుభవార్త వస్తుందని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 1,960 పీఈటీ పోస్టులు ఖాళీగా ఉన్నాయని వెల్లడించారు. వాటిలో 505 మంది సమగ్ర శిక్ష ద్వారా పార్ట్ టైమ్ విధానంలో పనిచేస్తున్నారని తెలిపారు. మిగిలిన పోస్టులను త్వరలో భర్తీ చేసేందుకు చర్యలు చేపడతామన్నారు. అలాగే డీఎస్సీ నిర్వహణపై త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు. ఆట స్థలాలు లేని కార్పొరేట్ పాఠశాలలను గుర్తించి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

తొలుత ప్రశ్నోత్తరాల్లో ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ఫీజు రీయింబర్స్మెంట్ తీసుకొచ్చిన మహానేత వైఎస్సార్ అని కొనియాడారు. అదే బాటలో సీఎం జగన్ నడుస్తూ రూ.వేల కోట్లు విద్యకు ఖర్చు చేస్తున్నారన్నారు. ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి మాట్లాడుతూ నాడు నేడు కింద పాఠశాలలన్నీ కొత్తరూపు సంతరించుకుంటున్నాయన్నారు.

ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి మాట్లాడుతూ పాఠశాలలో యోగాను నిర్బంధ సబ్జెక్ట్ ప్రవేశపెట్టాలని సూచించారు. ఎమ్మెల్యే కిలారి రోశయ్య మాట్లాడుతూ గతంలో పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం కింద ఉడికి ఉడకని అన్నం, నీళ్ల సాంబారు పెట్టేవారని.. దీంతో 10 శాతం కూడా భోజనం చేసేవారు కాదన్నారు. కానీ నేడు 16 రకాల మెనూతో మంచి రుచికరమైన భోజనం పెడుతుండడంతో నూటికి నూరు శాతం పిల్లలు పాఠశాలల్లోనే భోజనం చేస్తున్నారని చెప్పారు. ఎమ్మెల్యే కంబాల జోగులు మాట్లాడుతూ రాష్ట్రంలో నేడు అక్షరాస్యత పెరుగుతుందంటే దానికి కారణం అమ్మఒడి, నాడు-నేడు, గోరుముద్ద వంటి పథకాలేనన్నారు.

Click here to Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page