సింగరేణి కార్మికులకు శుభవార్త.. 2,364 మంది రెగ్యులర్‌ ఉద్యోగులుగా గుర్తింపు

సింగరేణి కార్మికులకు శుభవార్త.. 2,364 మంది రెగ్యులర్‌ ఉద్యోగులుగా గుర్తింపు

సింగరేణి కార్మికులకు యాజమాన్యం శుభవార్త చెప్పింది. సింగరేణి కాలరీస్‌ సంస్థలో పనిచేస్తున్న 2,364 మంది బదిలీ వర్కర్లను జనరల్‌ మజ్దూర్‌లుగా క్రమబద్ధీకరిస్తున్నట్టు సంస్థ ఎండీ ఎన్‌.బలరామ్‌ తెలిపారు. సంస్థలో చేరినప్పటి నుంచి ఏడాదిలో భూగర్భ గనుల్లో 190 రోజులు, ఉపరితల గనులు, విభాగాల్లో 240 రోజులు విధులు నిర్వహించిన వారిని రెగ్యులరైజ్‌ చేస్తున్నట్టు వెల్లడించారు.

ఈ మేరకు త్వరలోనే ఉత్తర్వులు జారీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. సెప్టెంబరు ఒకటి నుంచి వీరిని జనరల్ మజ్దూర్‌లుగా గుర్తించబోతున్నట్లు స్పష్టం చేశారు. ఎలాంటి నిరీక్షణ లేకుండా ఏడాదిలో నిర్ణీత మస్టర్లు పూర్తి చేసిన వారిని జనరల్ మజ్దూర్లుగా గుర్తిస్తుండటం పట్ల కార్మికులు హర్షం వ్యక్తం చేశారు. సింగరేణిలో కారుణ్య, డిపెండెంట్ ఉద్యోగ నియామక ప్రక్రియలో భాగంగా సంస్థలో చేరిన వారిని తొలుత బదిలీ వర్కర్లుగా సంస్థ నియమిస్తోంది.

ఏడాది కాలం పనిచేసిన తర్వాత కనీస మస్టర్లు పూర్తి చేస్తే జనరల్ మజ్దూర్లు (శాశ్వత ఉద్యోగులు)గా గుర్తిస్తోంది. ఉన్నత విద్యార్హతలు కలిగిన వీరంతా కంపెనీలో ఇంటర్నల్ ఉద్యోగాల ద్వారా పదోన్నతులు పొందడానికి అర్హత లభిస్తుంది. అలాగే క్వార్టర్ల కేటాయింపులో ప్రాధాన్యత ఉంటుంది. క్రమశిక్షణతో పనిచేయాలని సీఎండీ ఎన్.బలరామ్ కోరారు. సింగరేణిలో ఒకేసారి 2,364 మందిని జనరల్ మజ్దూర్లుగా ఉద్యోగ ఉన్నతి కల్పిస్తున్నామన్నారు.

You cannot copy content of this page