ఏపీ ప్రజలకు చంద్రబాబు శుభవార్త.. 20 లక్షల కుటుంబాలకు లబ్ధి

ఏపీ ప్రజలకు చంద్రబాబు శుభవార్త.. 20 లక్షల కుటుంబాలకు లబ్ధి

ఏపీ ప్రజలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుభవార్త వినిపించారు. రాష్ట్రంలోని 20 లక్షల ఇళ్లకు ఈ ఏడాది సౌర విద్యుత్ సౌకర్యం కల్పించనున్నట్లు ప్రకటించారు. పీఎం సూర్యఘర్ పథకం కింద ఈ ఏడాది రాష్ట్రంలోని 20 లక్షల ఇళ్లకు సౌర విద్యుత్ అందించాలనేదే ప్రభుత్వ లక్ష్యమని చంద్రబాబు వెల్లడించారు. ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు 2 కిలోవాట్ల వరకూ ఉచితంగా సోలార్ పరికరాలు అందిస్తామని తెలిపారు. సచివాలయంలో సోమవారం ఎస్‌ఎల్‌బీసీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బ్యాంకర్లకు సీఎం చంద్రబాబు నాయుడు పలు కీలక అంశాలపై దిశానిర్దేశం చేశారు. స్వర్ణాంధ్ర విజన్‌-2047 కలను సాకారం చేసుకోవటంలో బ్యాంకులు భాగస్వాములు కావాలని చంద్రబాబు కోరారు. రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయానికి బ్యాంకర్లు సహకారం అందించాలని చంద్రబాబు కోరారు. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు ఉండకూడదని సూచించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలపై దర్యాప్తు సంస్థలకు సహకారం అందించాలని చంద్రబాబు బ్యాంకర్లకు సూచించారు.

మరోవైపు పీఎం సూర్యఘర్‌ పథకం కింద రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు చెందిన 20.10 లక్షల విద్యుత్‌ కనెక్షన్లకు ఉచితంగా సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేయాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఒక్కో ఇంటిపై 2 కిలోవాట్ల సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేయనుంది. అలాగే లబ్ధిదారులపై భారం పడకుండా.. ప్రతి నెలా కొంత మొత్తాన్ని లీజు రూపంలో ప్రభుత్వమే చెల్లించనుంది. సోలార్ ప్యానెళ్ల ఏర్పాటు కోసం ఇప్పటికే సర్వే కూడా పూర్తి చేశారు. ఒక్కో ఇంటిపై 2 కిలోవాట్ల సౌర విద్యుత్ పలకలు ఏర్పాటు చేసేందుకు సుమారుగా లక్షా 15 వేల రూపాయలు ఖర్చవుతుందని ప్రభుత్వం అంచనా. ఇందులో కేంద్ర ప్రభుత్వం రూ.60 వేలు రాయితీ అందిస్తోంది. మిగతా 55 వేల రూపాయలను ఏపీ ప్రభుత్వమే భరించనుంది.

మరోవైపు రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు నెలకు 200 యూనిట్ల వరకూ ప్రభుత్వం ఉచిత విద్యుత్ అందిస్తోంది. ఈ పథకం కోసం ప్రతి నెలా రూ.200 కోట్ల వరకూ డిస్కంలకు సబ్సిడీ రూపంలో చెల్లిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎస్సీ, ఎస్టీల ఇళ్లపై సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేసి.. సబ్సిడీ కింద చెల్లిస్తున్న మొత్తాన్ని ప్రాజెక్టు కోసం ఖర్చు చేయాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. అలాగే ప్రాజెక్టు అమలు కోసం డిస్కంలు రుణాలు తీసుకోవాలని.. ఇలా తీసుకున్న రుణం నెల వాయిదాను ప్రభుత్వమే ప్రతి నెలా చెల్లించనుంది.

మరోవైపు సోలార్ ప్యానెళ్ల ఏర్పాటు ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్‌లో 200 యూనిట్ల వరకూ ఆ కుటుంబానికి ఉచితంగా అందిస్తారు. అలాగే సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేసుకున్నందుకు లీజు రూపంలో ప్రతి నెలా రూ.200 చొప్పున ఆదాయం లభిస్తుంది.

Click here to Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page