ఏపీలోని ఆ రెండు నగరాల్లో మెట్రో రైలు.. ప్రభుత్వం కీలక ప్రకటన

ఏపీలోని ఆ రెండు నగరాల్లో మెట్రో రైలు.. ప్రభుత్వం కీలక ప్రకటన

ఆంధ్రప్రదేశ్‌లో మెట్రో రైలు ప్రాజెక్టుకు సంబంధించి ప్రభుత్వం ఫోకస్ పెట్టిది. ఏపీలోని ఆ రెండు నగరాల్లో మెట్రో ఏర్పాటుకు సంబంధించి కసరత్తు మళ్లీ మొదలవుతోంది. రాష్ట్రంలో విజయవాడ-అమరావతి, విశాఖపట్నం మెట్రోరైలు ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష చేశారు. ఈ రెండు మెట్రో ప్రాజెక్టులకు సంబంధించి.. తొలిదశలో చేపట్టే డీపీఆర్‌లు వెంటనే కేంద్రానికి పంపాలని అధికారుల్ని ఆదేశించారు. తాజాగా సవరించిన డీపీఆర్‌ల ప్రకారం.. ఈ రెండు దశలకు కలిపి విజయవాడ-అమరావతి మెట్రోరైలు ప్రాజెక్టుకు రూ.25,130 కోట్లు. అలాగే విశాఖపట్నం మెట్రో ప్రాజెక్టుకు రూ.17,232 కోట్లు ఖర్చవుతుందని ప్రాథమికంగా ఓ అంచనా వేశారు.

విజయవాడ-అమరావతి మధ్య మెట్రో రైలు.. మొత్తం పొడవు 66.20 కిలో మీటర్లుగా డీపీఆర్ సిద్ధం చేశారు. రెండు దశల్లో ఈ ప్రాజెక్టును చేపట్టాలని భావిస్తున్నారు. తొలి దశలో మొత్తం 38.40 కిలోమీటర్లు నిర్మాణం చేపట్టాలని.. దీనికి అయ్యే వ్యయం రూ.11,009 కోట్లుగా అంచనా వేశారు. విజయవాడలోని పండిట్‌నెహ్రూ బస్‌స్టేషన్‌ నుంచి గన్నవరం విమానాశ్రయం వరకు 25.95 కిలోమీటర్ల దూరం.. బస్‌స్టేషన్‌ నుంచి పెనమలూరు వరకు 12.45 కిలోమీటర్ల దూరం ప్లాన్ చేశారు. రెండో దశలోలో 27.80 కిలోమీటర్లకు.. నిర్మాణ వ్యయం రూ.14,121 కోట్లుగా అంచనా వేశారు. పండిట్‌నెహ్రూ బస్‌ స్టేషన్‌ నుంచి రాజధాని అమరావతికి 27.80 కిలోమీటర్ల దూరం మెట్రో రైలుకు ప్లాన్ చేశారు.

విశాఖలో మెట్రో రైలు ప్రాజెక్టును.. రెండు దశల్లో నాలుగు కారిడార్లుగా పూర్తి చేయాలని చేపట్టాలని ప్రతిపాదించారు. ఈ నాలుగు కారిడార్లు కలిపి 76.90 కిలోమీటర్ల మేర మెట్రోరైలు ప్రాజెక్టు నిర్మాణం చేస్తారు.. మొత్తం 54 స్టేషన్లు ఉంటాయి. తొలిదశలో చేపట్టే మూడు కారిడార్లు మొత్తం 46.23 కిలోమీటర్లు కాగా.. నిర్మాణ వ్యయం రూ.11,498 కోట్లుగా ప్రతిపాదించారు. కారిడార్‌ 1లో విశాఖ స్టీల్‌ప్లాంట్‌ నుంచి కొమ్మాది వరకు 34.40 కిలోమీటర్లు కాగా.. మొత్తం 29 స్టేషన్‌లు ప్రతిపాదించారు. కారిడార్ 2లో గురుద్వారా నుంచి పాత పోస్టాఫీసు వరకు 5.07 కిలోమీటీర్లలో.. 6 స్టేషన్‌లు ప్లాన్ చేశారు. కారిడార్‌ 3లో తాడిచెట్లపాలెం నుంచి చినవాల్తేరు వరకు 6.75 కిలీమీటర్లకు 7 స్టేషన్‌లు ప్రతిపాదన చేశారు. విశాఖలో రెండో దశలో చేపట్టే పనుల్లో ఒకటే కారిడార్‌ ప్రతిపాదించారు. కారిడార్‌ 4లో కొమ్మాది నుంచి భోగాపురం విమానాశ్రయం వరకు 30.67 కిలోమీటర్లు.. 12 స్టేషన్‌లు ప్రతిపాదించారు. నిర్మాణ వ్యయం రూ.5,734 కోట్లుగా ఉంది.

విజయవాడ-అమరావతి, విశాఖపట్నం మెట్రో రైలు ప్రాజెక్టులు విభజన చట్టంలో ఉన్నాయని గుర్తు చేశారు మంత్రి నారాయణ. అందుకే ఈ ప్రాజెక్టుల నిర్మాణానికి అయ్యే మొత్తం వ్యయాన్ని కేంద్రమే భరించాలని కోరుతున్నామన్నారు. ఆ రెండు ప్రాజెక్టులపై 2019కి ముందు అప్పటి టీడీపీ ప్రభుత్వం కసరత్తు చేసి కేంద్రానికి ఆమోదానికి పంపామని గుర్తు చేశారు. అప్పుడు కొత్త పాలసీ తెస్తున్నామని.. దాని ప్రకారం మళ్లీ దరఖాస్తు చేయాలని కేంద్రం సూచించింది అన్నారు. కానీ ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం మెట్రో రైలు ప్రాజెక్టును నిర్లక్ష్యం చేసిందన్నారు. మళ్లీ ఈ రెండు ప్రాజెక్టుల్ని ప్రారంభించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారన్నారు. వెంటనే సవరించిన అంచనాల్ని, డీపీఆర్‌లను కేంద్రానికి పంపిస్తున్నామన్నారు.

You cannot copy content of this page