భారీగా తగ్గనున్న ‘ఇన్సూరెన్స్’ ప్రీమియం.. కేంద్రం కీలక నిర్ణయం.. సెప్టెంబర్ 9న ప్రకటన

భారీగా తగ్గనున్న ‘ఇన్సూరెన్స్’ ప్రీమియం.. కేంద్రం కీలక నిర్ణయం.. సెప్టెంబర్ 9న ప్రకటన

ఇన్సూరెన్స్ పాలసీలను అందుబాట ధరల్లోకి తీసుకురావాలని, అందుకు వస్తు సేవల పన్ను జీఎస్‌టీ ఎత్తివేయాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి. ఇదే సమయంలో అందరికీ ఇన్సూరెన్స్ అందేలా చర్యలు తీసుకోవాలని కేంద్రం భావిస్తోంది. ఇందులో భాగంగా బీమా పాలసీల ప్రీమియంలపై జీఎస్‌టీ విషయంలో కీలక నిర్ణయం వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీలను జీఎస్‌టీ నుంచి మినహాయించే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. సెప్టెంబర్ 9వ తేదీన జరగనున్న జీఎస్‌టీ మండలి సమావేశంలో ఈ దిశగా నిర్ణయం వెలువడే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.

అయితే, పెట్టుబడుల కోసం తీసుకునే బీమా పాలసీలపై మాత్రం జీఎస్‌టీ యథాతథంగా కొనసాగించే అవకాశమే ఉందని ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు. టర్మ్ ఇన్సూరెన్సు అనేది పూర్తి స్థాయి బీమా రక్షణ ఉంటుంది. ఇతర పాలసీలు అయితే బీమా రక్షణతో పాటు ఇతర ప్రయోజనాలు కల్పిస్తాయి. అందుకే వాటికి మినహాయింపు ఇవ్వకపోవచ్చని సమాచారం. జీఎస్‌టీ ఎత్తివేసినట్లయితే కేంద్ర ప్రభుత్వానికి సుమారు. రూ. 200 కోట్ల మేర ఆదాయం కోల్పోయే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, టర్మ్ ఇన్సూరెన్స్ ప్రీమియంలపై జీఎస్‌టీ ఎత్తివేస్తే పాలసీదారులకు ప్రయోజనం కలగనుంది. దీంతో ఎక్కువ మంది టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకునేందుకు ముందుకు వస్తారని కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తోంది.

లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలపై వస్తు సేవల పన్ను తొలగించాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కి కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఇటీవలే లేఖ రాసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచే జీఎస్‌టీ ఎత్తివేత అంశంపై చర్చ కొనసాగుతోంది. గడ్కరీ లేఖ నేపథ్యంలో విపక్షాల నుంచి డిమాండ్లు పెరిగాయి. ప్రస్తుతం హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్సులపై 18 శాతం జీఎస్‌టీ విధిస్తున్నారు. అయితే, ఇతర బీమా ప్లాన్లపై వేరు వేరు రేట్లు ఉన్నాయి. తొలి ఏడాది ప్రీమియంపై 4.5 శాతం, ఆ తర్వాత 2.25 శాతం చొప్పున జీఎస్‌టీ చెల్లించాల్సి వస్తోంది. అయితే, జీఎస్‌టీ కౌన్సిల్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.

You cannot copy content of this page