AP Cabinet Key Decisions August 2024: ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు

AP Cabinet Key Decisions August 2024: ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు

AP Cabinet Key Decisions: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో జరిగిన కేబినెట్ సమావేశం ముగిసింది.. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదముద్ర పడింది.

క్యాబినెట్ ఆమోదించిన నిర్ణయాలు

  • మావోయిస్టులపై నిషేధం మరో ఏడాది పొడిగింపు.
  • పశుసంవర్ధకశాఖ, మత్స్యశాఖలు విడుదల చేసిన, జీవో నెంబర్ 217, 144 జీవోలు రద్దు
  • రిజర్వాయర్, చెరువుల్లో పబ్లిక్ ఆక్షన్ రద్దు చేసి, స్థానిక మత్స్యకారులకు అవకాశం
  • స్థానిక సంస్థలు, పంచాయతీరాజ్ ఎన్నికల్లో ఇద్దరు పిల్లల నిబంధన మినహాయించుతూ తీర్మానం
  • కొత్త మెడికల్ కాలేజిల్లో 100 సీట్లతో MBBS కోర్సులు
  • అక్టోబర్ 1 నుంచి ఏపీలో కొత్త మద్యం పాలసీ
  • అందుబాటు ధరల్లో నాణ్యమైన మద్యం సరఫరాకు నిర్ణయం
  • పట్టాదారు పాస్పుస్తకాలపై ఏపీ ప్రభుత్వ ముద్ర
  • భూఅక్రమాలు వెలికితీయాలని ఏపీ కేబినెట్ నిర్ణయం.
  • జిల్లాల్లో రెవెన్యూ అధికారులు పర్యటించాలని ఆదేశం. 22 ఏ ఫిర్యాదులపై మూడు నెలల్లో పరిష్కారం. అప్పటివరకు 22ఏ భూముల రిజిస్ట్రేషన్లు నిలిపివేత ఇప్పటికే పూర్తయిన రిజిస్ట్రేషన్లపై విచారణ

ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన క్యాబినెట్‌ సమావేశం ముగిసింది. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించారు. మంత్రివర్గం సమావేశం ముగిసిన అనంతరం మంత్రి పార్థసారథి మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశంలో చర్చించిన అంశాలు, తీసుకున్న నిర్ణయాలను ఆయన వెల్లడించారు. రెవెన్యూశాఖలో మూడు నెలల పాటు రిజిస్ట్రేషన్లు నిలిపివేస్తామని, క్యూఆర్‌ కోడ్‌తో కూడిన పాస్‌పుస్తకాలు ఇస్తామని వెల్లడించారు. రాష్ట్రంలో అక్టోబర్‌ 1 నుంచి నూతన మద్యం విధానం అమలు చేస్తామన్నారు. తక్కువ ధరకే నాణ్యమైన మద్యాన్ని అందిస్తామని తెలిపారు. జగన్‌ బొమ్మ, పేరు ఉన్న సర్వేరాళ్లను ఏం చేయాలనే అంశంపై చర్చించినట్లు తెలిపారు. దేశంలో ఫెర్టిలిటీ రేటు తగ్గుతోందని.. ఏపీలోనూ సంతానోత్పత్తి రేటు తగ్గుదల అంశంపై చర్చ జరిగిందని పేర్కొన్నారు.

‘‘స్థానిక ఎన్నికల్లో ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలు ఉంటే అనర్హత వేటు నిబంధన ఎత్తివేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఈ నిబంధన ఎత్తివేసేలా చట్ట సవరణ బిల్లుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది.  సర్వే రాళ్లపై జగన్‌ బొమ్మ, పేరు తొలగించాలని పలువురు మంత్రులు సూచించారన్నారు. బొమ్మల పిచ్చితో నాటి సీఎం రూ.700 కోట్లు వాడేశారని మంత్రులు అన్నారని తెలిపారు.  మావోయిస్టులపై మరో ఏడాది నిషేధం విధించేలా క్యాబినెట్‌ తీర్మానం చేసింది. వైకాపా ప్రభుత్వం, గతంలో తెదేపా హయాంలో చేపట్టిన మద్యం విధానాలపై చర్చ జరిగింది. ఎక్సైజ్‌ విధానంలో అక్రమాలకు తావులేకుండా మార్పులు, చేర్పులపైనా చర్చించారు. మత్స్యకారుల ప్రయోజనాలకు విఘాతం కలిగించేలా ఉన్న 217 జీవోను రద్దు చేస్తూ కేబినెట్ తీర్మానించాం’’ అని పార్థసారథి తెలిపారు.

ఆ పాస్‌పుస్తకాలు వెనక్కి

‘‘సర్వే రాళ్లపై జగన్‌ బొమ్మ, పేరు తొలగించేందుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. రాజముద్ర ఉన్న కొత్త పట్టాదారు పాస్‌ పుస్తకాల పంపిణీకి నిర్ణయం తీసుకుంది. జగన్‌ బొమ్మలతో ఉన్న పాస్‌ పుస్తకాలను వెనక్కి తీసుకోనుంది. రీ సర్వేపై క్యాబినెట్‌లో రెవెన్యూశాఖ నోట్‌ సమర్పించింది. దీనివల్ల తలెత్తిన వివాదాలపైనా చర్చ జరిగింది. గత ప్రభుత్వ విధానం వల్ల రీ-సర్వేపై ఆందోళన ఉందని మంత్రులు తెలిపారు. భూ యజమానుల్లో ఆందోళనతో గ్రామాల్లో వివాదాలు పెరుగుతాయని మంత్రులు అభిప్రాయపడ్డారు. రీ- సర్వే ప్రక్రియను అబేయెన్స్‌లో పెట్టాలని నిర్ణయించాం’’ అని తెలిపారు.

మెడికల్‌ కాలేజీల్లో పోస్టుల పెంపునకు గ్రీన్‌ సిగ్నల్‌

‘‘నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ నిబంధనలకు అనుగుణంగా విజయనగరం, రాజమహేంద్రవరం, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాలలో 150 సీట్లతో నిర్మించిన కొత్త వైద్య కళాశాలల్లో గతంలో మంజూరైన పోస్టులకు అదనంగా మరో 380 పోస్టులు భర్తీ చేయాలన్న ప్రతిపాదనను ఆమోదించింది. ఫేజ్‌- 2కింద పాడేరు, మార్కాపురం, పులివెందుల, ఆదోని, మదనపల్లెలో నిర్మించిన వైద్య కళాశాలల్లో 2024-25 విద్యాసంవత్సరానికి సంబంధించి 100 సీట్లతో మొదటి సంవత్సరం ఎంబీబీఎస్‌ కోర్సు ప్రారంభించడానికి చేసిన ప్రతిపాదనకు క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది.  గుజరాత్‌లో ఉన్న పీపీపీ మోడల్‌ను అధ్యయనం చేయాలని సీఎం సంబంధిత శాఖల మంత్రులు, అధికారుల్ని  ఆదేశించారు’’ అని వెల్లడించారు.

జీవో 40 రద్దు.. సున్నిపెంటకు కేటాయించిన 280 ఎకరాలు వెనక్కి

‘‘జీవో నంబర్‌ 40 రద్దు కోసం జలవనరుల శాఖ చేసిన ప్రతిపాదనకు ఆమోదం లభించింది. మే 11, 2023న జారీ చేసిన జీవో 40 ప్రకారం నంద్యాల జిల్లా సున్నిపెంట గ్రామ పంచాయతీకి కేటాయించిన 280.74 ఎకరాల భూమిని రద్దు చేస్తూ.. దాన్ని తిరిగి నీటిపారుదల శాఖకు బదలాయించే ప్రతిపాదనకు క్యాబినెట్‌ ఆమోదం. ఈ భూమిని అన్ని చట్టాలను పరిగణనలోకి తీసుకొని శ్రీశైలం దేవాలయాన్ని అభివృద్ధి చేసేందుకు రూపొందించిన మాస్టర్‌ ప్లాన్‌కు వినియోగించుకోవాలని సూచన. రాష్ట్రంలో సంతానోత్పత్తి రేటు తక్కువగా ఉండటంపై చర్చించాం. రాష్ట్ర భవిష్యత్తులో యువత జనాభా తగ్గిపోనుంది. ఎక్సైజ్‌శాఖలో మెరుగైన విధానాలు ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. ఇతర రాష్ట్రాల్లో ఉన్న విధానాలను అధ్యయనం చేయాలని నిర్ణయించాం’’ అని మంత్రి పార్థసారథి వివరించారు.

You cannot copy content of this page