డ్వాక్రా మహిళల పిల్లల చదువుకు భరోసానిచ్చేలా కూటమి ప్రభుత్వం మరో కొత్త పథకానికి రూపకల్పన చేసింది. వారి విద్యా వికాసానికి తోడ్పడేందుకు 4% వడ్డీకే (35 పైసలు) రుణాలు అందించాలని నిర్ణయించింది.
గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ(సెర్ప్) పరిధిలోని స్త్రీనిధి బ్యాంకు ద్వారా రూ.10వేల నుంచి గరిష్ఠంగా రూ. లక్ష వరకు రుణం అందించనున్నారు. ప్రస్తుతం స్త్రీనిధి ద్వారా డ్వాక్రా సభ్యులకు 11% వడ్డీతో రుణాలిస్తున్నారు.
పిల్లలను చదివించేందుకు తల్లిదండ్రుల చేతిలో డబ్బులు లేక బయట ఎక్కువ వడ్డీలకు తెచ్చి అప్పుల పాలవుతున్న విషయాన్ని గుర్తించిన ప్రభుత్వం..వారికి చేయూతగా నిలిచేందుకు కొత్త పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించింది.
ఎన్టీఆర్ విద్యా సంకల్పంగా ఈ పథకానికి నామకరణం చేస్తూ అధికారులు ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వానికి నివేదించారు. కేజీ నుంచి పీజీ వరకు ఈ పథకాన్ని అమలు చేయనున్నారు.
ప్రభుత్వ,ప్రైవేటు పాఠశాలలు, విద్యా సంస్థల్లో చదివే విద్యార్థులకు వర్తింప చేయనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చేతులమీదుగా త్వరలో ఈ పథకాన్ని అమల్లోకి తీసుకువచ్చేలా అధికారులు కసరత్తు పూర్తి చేశారు.
స్త్రీనిధి నుంచి రుణంగా తీసుకునే మొత్తాన్ని పిల్లల చదువుకే వినియోగించాలి. వారి ఫీజు చెల్లింపులు, పుస్తకాలు,యూనిఫాం, ఇతర వాటి కొనుగోలుకు వెచ్చించవచ్చు.
సాంకేతిక విద్యలో అవసరాలకు ఖర్చు చేసేందుకు అవకాశం ఉంటుంది. నివాస ప్రాంతం నుంచి దూరంగా ఉండేపాఠశాలలకు వెళ్లేందుకు సైకిళ్ల కొనుగోలుకు అనుమతిస్తారు.అయితే ఎందుకోసం వినియోగించామో సంబంధిత రసీదును స్త్రీనిధి అధికారులకు అందించాలి. రుణ మొత్తాన్నివాయిదాల రూపంలో చెల్లించాలి. తీసుకున్న మొత్తానికి అనుగుణంగా కనిష్ఠంగా 24 నెలల నుంచి గరిష్ఠంగా 36నెలల వరకు చెల్లించే వెసులుబాటు కల్పిస్తారు. ఏడాదికిరూ.200 కోట్లు ఖర్చు చేసేలా ప్రణాళిక రూపొందించారు.
Leave a Reply